28-06-2025 06:52:15 PM
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road), కొండాపూర్లను అనుసంధానించే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దివంగత పి జనార్దన్ రెడ్డి (P. Janardhan Reddy) పేరు మీద ఉన్న శిల్పా లేఅవుట్ స్టేజ్-II ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శనివారం ప్రారంభించారు. రూ.182.72 కోట్ల వ్యయంతో కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఆరు వరుసలు, 24 మీటర్ల వెడల్పు, 1.2 కిలో మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ప్టైఓవర్-2 అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఉపాధి కోసం నగరానికి ఎంతో మంది వస్తుంటారని, పేదలు ఎప్పుడు పిలిచినా పలికే నాయుడికి పీజేఆర్ పేరు సంపాదించారని పేర్కొన్నారు. పీజేఆర్ ఇల్లు ఒక జనతా గ్యారేజీగా కనిపించేదని, హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పీజేఆర్ చేసిన కృషి మరవలేనిదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ చేసిన కృషి వల్లే హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయని, గచ్చిబౌలి ప్రాంతం ఐటీ కంపెనీలకు ప్రసిద్ధిగా మారిందని ఆయన చెప్పారు.
పీజేఆర్ కృషితోనే హైటెక్ సిటీ గచ్చిబౌలికి మంజూరైందని, హైటెక్ సిటీకి కాంగ్రెస్ హయంలోనే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలోని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని, ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా మా యజ్ఞం ఆగదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యంలో తమతో అందరూ కలిసి వస్తున్నారని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి జీవించలేని పరిస్థితి వచ్చిందని, ఒక ప్రణాళిక లేకపోవడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి పాఠాలు నేర్చుకుని మనం ఒక ప్రణాళికతో వెళ్లాలని సూచించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని సీఎం అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలి భూముల్లో అభివృద్ధికి ఆటంకాలు తాత్కాలికమే అని, ఆ ఆటంకాలను అధిగమించి కంచె గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తానే కొత్త కంపెనీలతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు.