01-12-2025 04:01:57 PM
హైదరాబాద్: మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడారం అభివృద్ధిలో భాగంగా రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలు ఇలా ప్రతి ఒక్క అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, స్థపతి శివనాగిరెడ్డి సమన్వయంతో సాగాలని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాలని మరోసారి స్పష్టంగా చెప్పారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ, కొండసురేఖ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కే.ఎస్.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.