05-07-2025 03:25:02 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండవ దశలో పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతికి సంబంధించి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్యతో కలిసి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంళ్లకు సంబంధించి రెండవ దశలో పథకానికి ఎంపికై మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు వేగంగా గ్రౌండింగ్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు రావడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కొరకు మన ఇసుక వాహనం ద్వారా ఉచితంగా ఇసుక పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. మన ఇసుక వాహనం ద్వారా ఇసుక అందించే విషయంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని మైనింగ్ శాఖ సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, ఏఈలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.