calender_icon.png 5 July, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ కలకలం

05-07-2025 06:19:34 PM

అవగాహన కల్పించిన వైద్యులు, సిబ్బంది..

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో డెంగ్యూ జ్వరం జాడలు కనిపిస్తున్నాయి. పారిశుధ్యం, పరిసరాలపై అవగాహన లోపం కారణంగా గ్రామాల్లో పలువురు జ్వరాలబారిన పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి  గ్రామంలో 14 ఏళ్ల బాలుడికి డెంగ్యూ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. గత పది రోజులుగా బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ నిర్ధారణ జరిగిందని నిజాంసాగర్ మండల వైద్యాధికారి రోహిత్ కుమార్ తెలిపారు. దీంతో శనివారం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు డెంగ్యూ పాజిటివ్ వచ్చిన బాలుడి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

అలాగే గ్రామంలో ఇంటింటికీ తిరిగి జ్వర లక్షణాలు ఉన్న వారి వివరాలను సేకరించారు. సమీపంలోని మరో 50 మంది గ్రామస్థులకు పరీక్షలు చేయగా అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. డెంగ్యూ నివారణ కోసం గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి రోహిత్​కుమార్​ పేర్కొన్నారు. వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని.. మురికినీరు ఎక్కడ నిలువ ఉన్నా దోమలు ఆ నీటిని ఆవాసంగా మార్చుకుంటాయని వివరించారు. గ్రామంలో ఎక్కడకూడా నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, సూపర్​వైజర్లు, ఏఎన్​ఎంలు, ఆశా వర్కర్లు తదితరులున్నారు.