డీఈవో కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ
జనగామ, మే 11 (విజయక్రాంతి): ఈ - ఆఫీస్లోనే అన్ని ఫైళ్ల నిర్వహణ ఉండాలని జిల్లా కలెక్టర్, విద్య శాఖ అధికారి సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించి, సిబ్బంది పనితీరు, సెక్షన్ ల నిర్వహణ, ఫైళ్ల నిర్వహణ విధానంపై ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయంలో భౌతిక (ఫిజికల్) ఫైళ్ల నిర్వహణ ఉండకూడదని, అన్ని ఫైళ్లను డిజిటల్ విధానంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ - ఆఫీసులోనే అన్ని ఫైళ్లు అందుబాటులో ఉండేలా సమగ్ర నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు.ప్రతి సెక్షన్లో రికార్డుల నిర్వహణ, ఫైళ్ల క్రమబద్ధీకరణ, పెండింగ్ అంశాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఈ మేరకు కార్యాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.






