25-07-2025 08:17:00 PM
రామగుండం,(విజయక్రాంతి): గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.