09-01-2026 09:09:08 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఆధునిక తెలంగాణ సాహిత్యంపై సమాలోచన కార్యక్రమాన్ని దోమకొండ కోటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వెలుగులోకి వచ్చిన సాహిత్యం ప్రజల జీవన విధానాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందన్నారు.
ఆధునిక తెలంగాణ సాహిత్యం సమాజంలో మార్పుకు దోహదపడుతూ నూతన తరానికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. సాహిత్య సృష్టికర్తలు సామాజిక బాధ్యతతో రచనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సాహిత్య ప్రాధాన్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను సాహితీ వేత్తలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.