26-06-2025 01:01:35 AM
మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
నిజామాబాద్, జూన్ 25 :(విజయ క్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బుజ్జమ్మను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆమెను ఆసుపత్రి వర్గాలు సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్, వృద్ధురాలు బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.
అయితే తమ స్వస్థలమైన పెర్కిట్ కు చేరువలో ఉన్న ఆర్మూర్ లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ దూరపు బంధువులు చెప్పడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్ కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.