23 June, 2026 | 1:34 AM

అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ నాయకులు తోక ముడిచారు..

23-06-2026 12:00 AM

బిజెపి రాష్ట్ర నాయకురాలు పద్మ

హనుమకొండ, జూన్ 22 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్థానిక అభివృద్ధిని గాలికొదిలేసి, కేవలం అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావు పద్మ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈరోజు హనుమకొండ హంటర్ రోడ్ లోని వేద బ్యాంక్వేట్ హాల్ లో బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కాంగ్రెస్ పార్టీ వైఖరిపై నిప్పులు చెరిగారు.ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరితే, సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు తోక ముడిచారని ఎద్దేవా చేశారు.

ఆనాడైనా, ఈనాడైనా ఓరుగల్లు నగరంలో జరిగిన, జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి కేవలం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ నిధుల నుంచి మొదలుకొని మౌలిక వసతుల కల్పన వరకు అన్నింటికీ కేంద్రమే నిధులు అందించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఈ ముగ్గురూ (ఆర్‌ఆర్‌ఆర్) అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని పద్మ రెడ్డి మండిపడ్డారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ పై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధాల రాజకీయం పక్కన పెట్టి, వరంగల్ అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పగడాల కాళీప్రసాద్, జిల్లా నాయకులు సండ్ర మధు, కూతురు రాజు, కందగట్ల సత్యనారాయణ, తోపుచర్ల మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.