14-08-2025 01:35:05 AM
- ‘ఓట్ల దొంగలు గద్దె దిగండి’ నినాదంతో ఉద్యమం
- నేడు రాత్రి జిల్లాకేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు
- 22 నుంచి రాష్ట్రస్థాయి ప్రదర్శనలు
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఓట్ చోరీపై ఢిల్లీ కేంద్రం కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్గాంధీ చేసిన ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉదృతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భావిస్తారు. ‘ఓట్ చోర్.. గద్దె చోడ్ (ఓట్ల దొంగలు గద్దె దిగండి)’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
ఓట్ల దొంగలను గద్దె దించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో ఉద్యమాన్ని చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ మేరకు గురువారం (ఆగస్టు 14) రాత్రి 8 గంటలకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మాస్ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఈ ప్రదర్శనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ కార్యవర్గం, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నాయకులు, బ్లాక్, మండల అధ్యక్షులు, అన్ని విభాగాల నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని సూచించారు. రెండో దశలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వరకు భారీ రాష్ర్టస్థాయి ప్రదర్శనలు చేపట్టనున్నారు. రాష్ట్ర రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో ప్రదర్శన చేయనున్నారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుపైన నాయకులు ప్రజలకు వివరించాలని, అందుకు భారీ జన సమీకరణ చేపట్టనున్నారు.
అన్ని విభాగాల నాయకులు, సీనియర్లు పాల్గొని పాదయాత్రలు, వాహన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేసి, బీజేపీ ఓట్ చోరీలపై ప్రసంగాలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఇక మూడో విడతలో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జాతీయ స్థాయిలో నెలరోజుల పా టు ఉద్యమం చేయనున్నారు. గడపగడపకు వెళ్లి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకాల సేకరించానలి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.