రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్ తూర్పు, మే 1: బీఆర్ఎస్, బీజేపీతో పోటీ మధ్య లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్లోని ఓ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆమె మాట్లాడారు. బీజేపీ శ్రీరాముడికి సైతం రాజకీయం అంటగడుతున్నదని మండిపడ్డారు. అయోధ్యలో సీత లేకుండా రాముడి ఒంటరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విడ్డూరమన్నారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. అక్రమ కేసులు పెట్టి నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం బీఆర్ఎస్ సంస్కృతి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బలవంతంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీలోకి చేర్చకున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 92శాతం మంది రైతులకు రైతుబంధు అందజేశారని స్పష్టం చేశారు.