31-01-2026 12:00:00 AM
టికెట్ రాకపోవడంతో మనస్థాపం
చండూరు మున్సిపాలిటీలో ఘటన
చండూరు, జనవరి 30(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు కౌన్సిలర్ టికెట్ కేటాయించలేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చండూరు మున్సిపాలిటీలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన భూతరాజు వేణు అనే వ్యక్తి మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డు నుంచి టికెట్ ఆశించారు.
అయితే నామినేషన్ చివరి రోజు వరకు వేచి చూసిన వేణుకు టికెట్ను కేటాయించకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది.వెంటనే అక్కడున్న వారు అప్రమత్తమై వేణుని స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. కాగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ తగాదాలు లేవని కార్యకర్తలంతా ఏకతాటిపై ఉన్నారని గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు ప్రకటించిన మరునాడే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.