31-01-2026 11:52:09 AM
హైదరాబాద్: తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. కేసీఆర్ లేని నివాసానికి రాత్రిపూట వచ్చి నోటీసులు అంటించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అన్నారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను ఇంటి వద్దే విచారించాలన్న నిబంధనను అతిక్రమించారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(Standard Operating Procedure) పై అవగాహన ఉందా?, సీఎం చేతిలో కీలుబొమ్మల్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పోలీసుల పనా? అని ప్రశ్నించారు. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తామన్న కేటీఆర్(KTR) మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని సూచించారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే ప్రజలే బుద్దిచెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.