కానిస్టేబుల్ ఆత్మహత్య!
- ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయం బాత్రూంలో ఉరేసుకున్న సాయికుమార్?
- ఘటనపై అనుమానాలు
- పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ఎల్బీనగర్, ఆగస్టు 12: ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయ బాత్రూంలో బుధవారం తెల్లవారుజామున ఓ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలంటూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం 9 గంటల పాటు ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండాలేమూర్ గ్రామపంచాయ తీ పరిధిలోని అజ్జిన తండాకు చెందిన జర్పు ల బోధ్య(55), విజయ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా, కుమారులకు వివాహం కాలేదు. పెద్ద కుమారుడు జె సేవాళ్ (27) ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు జె సాయికుమార్ (25) ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2024 బ్యాచ్కు చెందిన సాయికుమార్ కర్మన్ఘాట్లో స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధుల నిమిత్తం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయాలనికి వెళ్లిన సాయికుమార్.. అక్కడి బాత్రూంలో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకున్నట్టు తోటి ఉద్యోగులు గుర్తించినట్టుగా తెలిసింది. ఎల్బీనగర్ సీఐ వినోద్కుమార్ కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం సాయికుమార్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పోలీసులే కొట్టి చంపేశారు: కుటుంబ సభ్యులు
కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు గిరిజన సంఘాల నాయకులు చేరుకుని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట 9 గంటల పాటు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లి ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింట ర్ను ధ్వంసం చేశారు. సాయికుమార్ కుటు ంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయికుమార్ది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకుంటే మృతదేహంపై రక్తపు మరకలు ఎలా వచ్చాయని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మరో ఉద్యోగ పోటీ పరీక్ష కోసం 15 రోజుల పాటు సెలవు తీసుకుంటానని మంగళవారం రాత్రే తమతో చెప్పాడని, అలాంటి వ్యక్తి తెల్లారేసరికి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. నిత్యం సాయికుమార్కు విధులు వేసి, ఆయనపై అధికా రులు ఒత్తిడి తెచ్చారని, పోలీసులే కొట్టి చం పారని ఆరోపించారు. మృతదేహాన్ని తమకు చూపించకుండా ఎందుకు ఉస్మానియాకు తరలించారని ప్రశ్నించారు. సీఐ వినోద్కుమార్ తన కుమారుడ్ని వేధించాడని సాయ కుమార్ తల్లి ఆరోపించింది.
నిత్యం నిఘాలో ఉండే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని గిరిజన సంఘా ల నాయకులు ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజీ ఎందుకు పనిచేయడంలేదని నిలదీశారు. ముమ్మాటికీ ఇది హత్యేనని ఆరోపించారు. సీబీఐ ద్వార్యా దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సీఎం రేవంత్రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాయికుమార్ మొబైల్ ఫోన్ తోపా టు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు వెల్లడించాలని కుటుంబ సభ్యు లు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామిరెడ్డి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, ఆందోళనను విరమింపజేశారు.
నిష్పక్షపాతంగా విచారణ చేపడతాం: డీసీపీ అనురాధ
సాయికుమార్ మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఘటన జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్లో ఎవరు విధుల్లో ఉన్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యత కుటుంబానికి న్యాయం చేస్తామని అని డీసీపీ అనురాధ హామీ ఇచ్చారు.
బాధ్యులపై చర్యలు తప్పవు: ఎమ్మెల్యే మల్రెడ్డి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్ మాట్లాడినట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం తరఫున రూ.22 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.
సాయికుమార్ రాసినట్టుగా చెప్తున్న సుసైడ్ నోట్ సమగ్రంగా విచారణ నిర్వహించాలని పోలీస్ కమిషనర్, మల్కాజిగిరి డీసీపీని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సాయికుమార్ తన నోట్లో డ్యూటీలో తనకు ఇబ్బందిగా ఉందని, తనను ప్రస్తుత విధుల నుంచి షిఫ్ట్ చేసి వేరే చోటుకు పంపించాలని కోరినట్లు ఉన్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధ్యులెవరైనా ఉంటే చర్యలు తప్పవని, సాయికుమా ర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.






