04-11-2025 01:34:27 PM
							భూ సమస్యతో న్యాయం కోరిన మహిళను ప్రైవేట్ రూమ్కు తీసుకెళ్లి లొంగదీసుకున్న కానిస్టేబుల్
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన... ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
డోర్నకల్:(విజయక్రాంతి): పోలీసులు ప్రజల రక్షకులు, సేవకులు అనే విశ్వాసంతో మనం స్టేషన్ తలుపు తడతాం. కానీ కొందరు అధికారుల అవకతవకలు ఆ విశ్వాసాన్నే దెబ్బతీస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్, భూ సమస్యతో పోలీసులను ఆశ్రయించిన మహిళను న్యాయం చేస్తానని నమ్మబలికి, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ రూమ్కు తీసుకెళ్లి లొంగదీసుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ కానిస్టేబుల్ను హెచ్చరించగా, కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది.
సదరు కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ రైట్హ్యాండ్గా వ్యవహరిస్తూ మండలంలో ముద్ర వేసుకున్నాడని చర్చలు వినిపిస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారుల వల్ల మొత్తం పోలీస్ శాఖే చెడ్డపేరు తెచ్చుకుంటోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఆ కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.