24 June, 2026 | 3:00 AM

వర్షాకాలంలో వంటకు తంటా!

24-06-2026 01:53 AM

కేసముద్రం, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కిచెన్ షెడ్లు నిర్మించలేదు. దీంతో మండల వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో చెట్ల కింద వంట చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 57 ప్రభుత్వ విద్యాలయాలు ఉండగా అం దులో 4,000 వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి అవసరమైన మౌలిక వసతులు అనేక పాఠశాలలో ఇప్పటివరకు కల్పించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, వంట వండి పెట్టే ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక పాఠశాలల్లో నీటి వసతి లేదని, చాలా చోట్ల కిచెన్ షెడ్లు లేవని , దీనితో పాఠశాలల ఆవరణలో వరండాలు, చెట్ల కింద వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

చాలాచోట్ల నీటి వసతి లేని చోట వ్యవసాయ బావుల నుండి, సమీపంలోని ఇండ్ల నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వంటకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ వర్షాకాలంలో తాము వంట చేయడానికి తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి అవసరమైన వంట చెరుకు నిల్వ చేయడం, సామాగ్రి నిలువ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే జులై, ఆగస్టు నెలలో వంట చేయడం తమకు పెద్ద తంటగా మారిందని వాపోతున్నారు. 

డైనింగ్ హాళ్లు లేవు..

ఇక అధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న హైస్కూళ్ళు, కొన్ని ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేయడానికి అనువైన వసతి లేక తరగతి గదుల్లో, పాఠశాల ఆవరణ చెట్ల కింద భోజనం చేస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో డైనింగ్ హాళ్లను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా చాలా చోట్ల పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు.

ఇక ఇదే తరహాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కిచెన్ షెడ్ నిర్మాణం ప్రారంభించినప్పటికీ చాలా చోట్ల నిర్మించలేదు.  దీనితో ఈ విద్యా సంవత్సరంలో కూడా పాత పద్ధతిలో చెట్ల కింద వంట చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలలో కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్ నిర్మించి, నీటి వసతి కల్పించాలని కోరుతున్నారు.