19-05-2024 12:46:02 AM
పోస్టాఫీసు ఎదుట పురుగుల మందుతో ధర్నా
ఆదిలాబాద్, మే 18 విజయక్రాంతి: తమ ఖాతాల్లో జమ అయిన పత్తి పంట డబ్బులు తమకు ఇవ్వాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. వాటికోసం మూడు నెలలుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు ఇవ్వడం లేదని పోస్టాఫీసు అధికారుల తీరుపై రైతులు అసహనానికి గురయ్యారు. శనివారం హెడ్ఫోస్టాఫీసు ఎదుట పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 74 మంది రైతులు పత్తి పంటను సీసీఐకి విక్రయించారు. సుమారు రెండు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమయ్యాయి. అయితే గతంలో ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో నుంచి ఇండియన్ పోస్టల్ బ్యాంకు మేనేజర్ విజయ్ జాదవ్ తన ఖాతాకు మళ్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే రైతులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ను అరెస్టు చేసి, విచారణ చేపడుతున్నారు. అయితే సదరు మేనేజర్ డబ్బులను రైతుల ఖాతాలోల షాడో అమౌంట్గా వేసినప్పటికీ అవి తమకు అందకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. పోస్ట్ ఆఫీస్ ఉన్నతాధికారులు, పోలీసులు రైతుల వద్దకు వచ్చి వారిని సముదాయించారు. జూన్ 15వ తేదీలోగా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.