09-06-2025 08:25:34 AM
హైదరాబాద్: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో(Sri Raja Rajeshwara Swamy Devasthanam) సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వర్షంలో ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల రద్దీతో గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజలు సేవలు రద్దు చేశారు. వేములవాడ స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు.
వేములవాడ ఆలయం(Vemulawada Temple)లో పండగ రోజులు, సోమవారాలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తులు ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, కోడె మొక్కు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శివాలయం. ఈ ఆలయం దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. భక్తులు ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని పూజిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇతర పరివార దేవతాలయాలను కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.