09-06-2025 02:22:51 AM
బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ
ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
ఇంఫాల్, జూన్ 8: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో మారు హింస చెలరేగింది. దీంతో బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ను నిలిపేశారు. శని వారం మైతీ తెగకు చెందిన నాయకుడు అరంబై టెంగోల్తో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. పలు ఆస్తులను ధ్వంసం చేశారు.
అంతే కాకుం డా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని నిరసనకారులు ప్రభుత్వాన్ని బెదిరించారు. శనివారం రాత్రి ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కూడా భారీగా నిరసనలు చెలరేగాయి. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. నిరసనకారులు ఇంఫాల్ విమానాశ్రయంలోని తులిహాల్ గేటు వెలుపల గుమిగూడి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు.
ఈ హింసను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు. పోలీసుల లాఠీచార్జిలో ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. ఆదివారం కూడా ఇవే పరిస్థితులు కొనసాగాయి. 2023 మే నుంచి కొనసాగుతున్న అల్లర్లలో వేల మంది గూడు లేక నిరాశ్రయులయ్యారు. ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది.