దళితులు అన్ని రంగాల్లో ఎదగాలి

29-04-2024 12:10:59 AM

l ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణమాదిగ

l కామారెడ్డి జిల్లా పిట్లంలో దళిత సమ్మేళనం

l సమ్మేళనంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ 

కామారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): దళితుల అభ్యున్నతే తన లక్ష్యమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో దళిత సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మందకృష్ణమాదిగ హజరయ్యారు. మహిళలలు బోనాలతో ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. సమావేశంలో పాల్గొన్న మందకృష్ణమాదిగ మాట్లాడుతూ... దళితులు సమాజంలో ఆర్థికంగా ఎదిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. గత ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పాయి తప్ప, ఎవరు కూడా దళితులకు న్యాయం చేయలేదని వాపోయారు.

ప్రధాని మోదీ దళితులకు న్యాయం చేస్తానని హమీ ఇవ్వడంతో దళిత సమ్మేళనానికి హజరైనట్లు చెప్పారు. జహీరాబాద్ బీజేపి ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ కొరకు పిట్లంకు రావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి బీబీపాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీబీపాటిల్ మాట్లాడుతూ... తనను ఎంపీగా గెలిపిస్తే, అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ది పనులు చేపడుతానని హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కొరుకుంటు న్నారని తెలిపారు. ఎన్నికల్లో పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.