04-11-2025 05:03:37 PM
							దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ (విజయక్రాంతి): భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు త్వరగా నమోదు చేసి నివేదికను అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ధర్మసాగర్ దేవునూరు ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు, వంతెన, వరి పంటలు దెబ్బతినగా కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. రోడ్ల మరమ్మతు పనుల గురించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
గ్రామంలో పంట నష్టం, రోడ్ల నష్టం పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ సుమారుగా అర కిలోమీటరు మేర నడుచుకుంటూ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఎంత మేరకు నష్టం జరిగిందని వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులకు చెందిన పంట పొలాలు నీట మునిగి దెబ్బతిన్న వరి పంటను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి జరిగిన పంటల నష్టం గురించిన వివరాలను స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ లో దెబ్బతిన్న పంటల వివరాల నమోదు చేస్తున్న సమాచారాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలను సర్వే నంబర్లు, రైతుల వారీగా వివరాలను నమోదు చేయాలన్నారు. వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారానికి నివేదిక అందించాల్సి ఉండగా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వివరాలను త్వరగా అందజేయాలన్నారు. అక్కడినుండి ముప్పారం గ్రామానికి చేరుకొని గ్రామంలో దెబ్బతిన్న పంటలు, రోడ్లను పరిశీలించారు. గ్రామంలో తీవ్రమైన వరద ధాటికి రోడ్లు బాగా దెబ్బతినగా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు. వరదలతో పశు సంపదకు జరిగిన నష్టం గురించిన వివరాలను కలెక్టర్ కు తెలియజేశారు. వరద తాకిడికి సుమారు 450 క్వింటాళ్ల వరి ధాన్యం కొట్టుకుపోయిన వివరాలను తెలియజేశారు. స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు.
స్థానిక చెరువు నుండి వచ్చిన వరద నీటితో దెబ్బతిన్న రోడ్లను, పంట నష్టాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదిత అంచనాల నివేదికను అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ధర్మసాగర్ రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్ కు ఎంత ఇన్ ఫ్లో వస్తుందని, రిజర్వాయర్ కెపాసిటీ, అవుట్ ఫ్లో గురించి నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గత నెల 29వ తేదీన రిజర్వాయర్ లో ఉన్న నీటి సామర్థ్యం, ఇతర వివరాలను కలెక్టర్ కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారామ్, డిఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ మంగీలాల్, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, ఏవో రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.