03-12-2025 04:20:11 PM
సహకరించిన కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నాయకులు, గ్రామస్తులకు అభినందనలు
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విశేష పరిణామం చోటుచేసుకుంది. గ్రామ ప్రజలు రాజకీయ భేదాలను పక్కనబెట్టి, గ్రామాభివృద్ధి, శాంతి, ఐక్యతను లక్ష్యంగా పెట్టుకొని దాసరి ఎల్లమ్మను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థులుగా వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ఎల్లమ్మ ఎన్నిక ఏకగ్రీవమైది. గ్రామ పెద్దలు, ఇరు పార్టీ నాయకులు పాల్గొన్న సమావేశంలో ఎల్లమ్మ పేరు ఖరారు చేయటంతో గ్రామంలో సంతోష వాతావరణం నెలకొంది.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దాసరి ఎల్లమ్మ మాట్లాడుతూ.. గ్రామం నాపై ఉంచిన నమ్మకాన్నిగౌరవంగా భావిస్తున్నానన్నారు. నా పదవి సేవ కోసం, అభివృద్ధి బాధ్యతగా చూస్తాననీ, గ్రామం అభివృద్ధికి నిబద్ధంగా పనిచేస్తాననీ తెలిపారు. అదేవిధంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ... దాసరి ఎల్లమ్మ ఏకగ్రీవ ఎన్నిక గ్రామ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచిందన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా ఈ నిర్ణయం మైలురాయిగా మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధిలో ఐకమత్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.