19-05-2025 10:22:41 PM
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చేత తిరస్కరించబడిన నాయకులు, పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నారని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో మరోసారి గట్టిగా గుణపాఠం నేర్పుదామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి(MLA Yashaswini Reddy) కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు సంస్థాగత సన్నాహక సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు, నాయకులకు మంచి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకురాలు రవళిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
33/11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన
పాలకుర్తి నియోజకవర్గంలోని జగన్నాథ పల్లి గ్రామంలో నూతనంగా 2 కోట్ల 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు.