11-07-2025 12:02:18 AM
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘కుబేర’ తర్వాత తెలుగు సినిమాలో బలమైన మార్కెట్ను సుస్థిరం చేసుకున్నాడు. ఇదే జోరులో ధనుష్ 54వ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. విమర్శకుల ప్రశంసలు పొందిన థ్రిల్లర్ పోర్ తోజిల్ ఫేం విఘ్నేష్ రాజా నడీ54 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో థింక్ స్టూడియోస్ సహకారంతో డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు ప్రారంభమైంది. అనౌన్స్ మెంట్ పోస్టర్లో ధనుష్ పవర్ ఫుల్ లుక్లో, అగ్ని దగ్గర నిలబడటం సినిమా సీరియస్ టోన్ ని సూచిస్తుంది. విలక్షణమైన కథాంశంతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు, ధనుష్ సరసన కథానాయికగా నటిస్తోంది.
కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీ పాండియరాజన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ను దర్శకుడు విఘ్నేష్ రాజా, ఆల్ఫ్రెడ్ ప్రకాష్ కలిసి రాశారు. ఈ చిత్రానికి డీవోపీ తేని ఈశ్వర్, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ శ్రీజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైన్ మాయాపాండి.