22-05-2025 01:40:21 AM
- 33 దేశాలకు ఎంపీల బృందం
- విదేశాలకు బయల్దేరిన రెండు బృందాలు
న్యూఢిల్లీ, మే 21: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ తీరును ప్రపంచ వేదికలపై ఎండగట్టేందుకు ఏర్పాటుచేసిన అఖిలపక్ష బృందాల పర్యటన బుధవారం మొదలైంది. జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని రెండు బృందాలు విదేశాలకు బయల్దేరాయి.
సంజయ్ బృందం జపాన్కు వెళ్లగా, షిండే బృందం యూఏఈకి వెళ్లింది. సంజయ్ బృందంలో బీజేపీ ఎంపీలు అపరాజితా సారంగి, బ్రిజ్లాల్, హేమాంగ్ జోషి, ప్రధాన్ బారువా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, మాజీ దౌత్యవేత్త మోహన్కుమార్ ఉన్నారు.
వీరు ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. షిండే బృందం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్, లైబీరియా వెళ్లనున్నారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన ఏడు బృందాలు 33 దేశాలకు వెళ్లనున్నాయి. ఐరాస భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు, మిగిలినవి భవిష్యత్తులో భద్రతామండలిలో చేరబోయే దేశాలని బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి మీడియాకు వెల్లడించారు.