మహిళల ఓట్ల కోసమే చీరల పంపిణీ
ముస్తాబాద్, నవంబర్ 24(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయిన బతుకమ్మ పండుగకు చీరలు అందించనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ చేసి మహిళల ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో కెసిఆర్ తెలంగాణ ఆడపడుచుల తోబుట్టువులా బతుకమ్మ పండగ కు చీరలను అందించిన గొప్ప నాయకుడని తెలిపారు.ఒక మంచి సంకల్పంతో ఈ పథకం ప్రవేశ పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఆ పథకాన్ని అటుకెక్కించిన ఘనత ఇచ్చిందని అన్నారు. కనీసం బతుకమ్మ పండుగకు ఒక్క చీరెను ఇవ్వకుండా నేడు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చీరలను అందించి మహిళల ఓట్ల కోసం ప్రయత్నాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు.
ప్రతి నెల ఉద్యోగికి జీతం వచ్చినట్లు ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తానని చెప్పి అలాగే కళ్యాణమస్తు పథకం కింద ప్రతి ఆడబిడ్డకు వివాహానికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం2000 ఆసరా పెన్షన్ 4000 పెంచుతామని మర్చిపోయిందన్నారు.పుట్టిన ప్రతి శిశువుకు బంగారు తల్లి పథకం పెడతామని ఇవ్వకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించిన బిడ్డకు కేసీఆర్ అందించిన కేసీఆర్ కిట్టును కూడా బందు చేయించారన్నారు. కళాశాల విద్యార్థినులకు స్కూటీలు అందిస్తానని ఇవ్వలేదని గుర్తు చేశారు.
చీరలు పంచి మహిళా ఓట్లు వేయించుకుంటామని భ్రమపడటం కాంగ్రెస్ కాంగ్రెస్ తీరు అవివేకని,రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి మహిళలే సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి.జహంగీర్, వంగూరి దిలీప్, శేఖర్,సాయి తదితరులు పాల్గొన్నారు.






