11-02-2026 02:56:39 AM
కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ‘సీఎం గారు.. మీకు మానవత్వం ఉందా. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. రిటైర్ అయ్యి రెండెళ్లయినా బెన్ఫిట్స్ బకాయిలను చెల్లించకపోవం దుర్మార్గమని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారన్నారు. ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ అని తెలిపారు. జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదన్నారు. తక్షణమే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వారి బకాయిలన్నీ చెల్లించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనుకాడబోనని బండి సంజయ్ కుమార్ తెలిపారు.