27-11-2025 12:15:08 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, నవంబర్ 26 (విజయ క్రాంతి) : గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఉదయాదీత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికల లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్వోలు,( స్టేజ్- వన్ ) ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదటి విడతన 14 మండలాలలోని 117 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, గ్రామపంచాయతీ ఎన్నికలను అధికారులందరూ సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పాటించాల్సిన అన్ని నియమాలను తూ.చా తప్పకుండా పాటించాలని, సమయపాలన పాటించాలని, నామినేషన్ల కేంద్రం వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తగినన్ని నామినేషన్ ఫారాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికల నియమ, నిబంధనలను తూ.చా తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎంపీ డి వో లు ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పిసిఈఓ శ్రీనివాసరావు, డి పి ఓ వెంకయ్య, నల్గొండ , చండూరు ఆర్డీవోలు వై.అశోక్ రెడ్డి, శ్రీదేవి, హాజరయ్యారు.