23-06-2025 05:31:18 PM
మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకై కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. అంతర్జాతీయ యాంటి డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆదిత్యా పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులతో కలసి జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో మొక్కలు నాటి మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు, ఆర్ధిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావాలతో పాటు ఆర్ధిక నష్టాలు, సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు. ఈ డ్రగ్స్ నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని అన్నారు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలనీ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే సమాచారం అందించాలని అన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ మాదక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యంగా పోస్టర్ ను ఆవిష్కరించి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సైనికుల వలె పాటుపడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టు టౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్.ఐలు సంతోష్ హరిబాబు,యస్. ఎస్ ఐ లు సైదులు, సైదాబాబు, శంకర్, సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.