calender_icon.png 29 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్మట్టిని ఆపే ధైర్యం లేదా?

29-09-2025 01:41:47 AM

  1. సీఎం కుర్చీ కోసమే కర్ణాటకతో కయ్యానికి రేవంత్ వెనకడుగు 
  2. ఆయన నల్లమల్ల పిల్లి బిడ్డ కాంగ్రెస్ బాకీ కార్డులతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం 
  3. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం 
  4. అచ్చంపేట సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి)/అచ్చంపేట: ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి ఉమ్మడి పాలమూరును ఎడారిగా మార్చే కర్ణాటక కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల్ల పులి అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిల్లిలాగా నోరెందుకు మెదపడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. తన సీఎం కుర్చీని కాపాడుకునేందుకే కర్ణాటకతో కయ్యానికి వెనకాడుతున్నారని ఆరోపించారు.

70 వేల కోట్లతో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును మరో ఐదు మీటర్లు పెంచే కర్ణాటక కాంగ్రెస్ కుట్ర ఫలిస్తే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు జీవనదిగా ఉన్న కృష్ణ మ్మ తడారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ‘బీఆర్‌ఎస్ జన గర్జన’ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కొడంగల్, కేఎల్‌ఐ లిఫ్ట్, పాలమూరు ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యామ్ నిరుపయోగంగా మారతాయని కేటీఆర్ హెచ్చ రించారు.

రాజోలిబండ కోసం 2001లో కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు సుంకేసుల తూములను బాంబులతో పేలుస్తామన్న రాయలసీమ ఎమ్మెల్యేకు, వెయ్యి బాంబులతో మొత్తం బరాజ్‌ను తునాతు నకలు చేస్తామని ఆనాడు కేసీఆర్ ధీటు గా బదులిచ్చారని గుర్తుచేశారు. అలాంటి దమ్ము, తెగువ రేవంత్‌రెడ్డికి లేవా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ఏ రోజుకైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఆల్మట్టి ఎత్తు పెంపు ఆపాలి..

రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కర్ణాటక ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీతో మాట్లాడించి, ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపించాలని సవాల్ విసిరారు. లేదంటే గులాబీ దండే స్వయంగా వెళ్లి అడ్డుకుంటుందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి నల్లమల్ల పులి కాదని, ఆయనో నల్లమల్ల నక్క అని ఎద్దేవా చేసిన కేటీఆర్, కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టిండన్నారు.

ఆ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని జైపాల్‌రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌తో అచ్చంపేట నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీళ్లిచ్చిందన్న కేటీఆర్, మరో 70 వేల ఎకరాలకు నీళ్లిచ్చేం దుకు రూ.1,350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. అచ్చంపేట బిడ్డ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తాం..

ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి తెలంగాణలోని ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. అత్తకు నాలుగు వేలు, కోడలికి రూ.2,500 ఇస్తానని చెప్పి కుటుంబాల్లో చిచ్చుపెట్టారని, వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ ఇవ్వకుండా రెండేండ్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకా యి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు.

కల్యాణలక్ష్మి కింద 8 లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డారని, దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ ఉన్నారని గుర్తు చేశారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలని, ఇదే ప్రజల చేతిలోని బ్రహ్మాస్త్రమని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ దందాలతో వందల కోట్లు సంపాదిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.5,000 ఇచ్చినా, బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని సూచించారు.

కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి ప్రమాణాలు చేయించినా, ఉత్తుత్తి ప్రమాణాలు చేసి కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూ లైన్లు మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ ప్రకటిం చకుండా రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలం గాణలో నడుస్తున్నది కాంగ్రెస్ జా యింట్ వెంచర్ ప్రభుత్వమని కేటీఆర్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 27న పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ దాడులు చేసి, నోట్ల కట్టలు దొరికాయని ప్రచారం చేశారని, కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరాక ఏడాది గడిచినా ఈడీ నోరు మెదపడం లేదని, ఇదే వారి మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ రెండు పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి తన పిచ్చి చేష్టలతో, దిగజారిన భాషతో తెలంగాణ పరువు తీస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒకరోజు పేద రైతుబిడ్డ అని, మరోరోజు పోలీస్ పటేల్ మనవడినని చెప్పే రేవంత్‌రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకుతింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకా నికి నిదర్శనమన్నారు.

మాట తప్పిన రేవంత్‌రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొందపె ట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడా రని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని భరోసా ఇచ్చారు.

తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. రేవంత్‌రెడ్డి పతనం అచ్చంపేట నుంచే ప్రా రంభం కావాలన్నారు. అంతకుముందు   కేటీఆర్‌కు దారి పొడవునా బీఆర్‌ఎస్ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి.