18-06-2025 12:24:47 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): రక్షిత మంచినీటి పథకం మిషన్ భగీరథ నీరు(Mission Bhagiratha Water) కలుషితం ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది. పైప్ లైన్ లీకేజీలు, గేట్వాల్ పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పడకేసింది. దీంతో ప్రజలకి కలుషిత తాగునీరే దిక్కయింది. బెల్లంపల్లి నియోజవర్గం లోని కన్నెపల్లి మండలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా తీరు పై ప్రజలు ఆందోళన పడుతున్నారు. కన్నెపల్లి మండలంలోని సూర్జాపూర్, బావాపూర్, జంగంపల్లి గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వ్యాధులకు పొంచి ఉన్న వర్షాకాలంలో తాగునీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరు నెలలుగా తాగు నీటి సరఫరా తీరు లో నెలకొన్న ఈ పరిస్థితిపై ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనికరించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలుషిత తాగునీటి నుంచి తమను కాపాడాలని గ్రామీణ ప్రజలు అధికారులను ఇప్పటికీ వేడుకుంటున్నారు. శీగ్రగతిన తాగునీటి పైప్లైను మరమ్మతులు చేపట్టాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. కలుషిత నీటిని నివారించేందుకు అధికారులు పైప్ లైన్ వ్యవస్థ పై ఇకనుంచైనా అనునిత్యం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకుంటలేరు: రాచర్ల మహేష్, సూర్జాపూర్ గ్రామస్తుడు
తాగునీటి కలుషితం పై చాలాసార్లు ఫిర్యాదు చేశాం. అధికారులు పట్టించుకోవడం లేదు. పైపులైను, గేట్ వాల్ లీకేజీని నివారించాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా కలుషిత నీటీ తాగుతున్నాo. ఇప్పటికైనా అధికారులు పైప్ లైన్, గేటు వాల్ లీకేజ్ ని వివరించాలి. వెంటనే తగిన మరమ్మత్తు పనులు చేపట్టాలి.