25-06-2025 02:05:34 PM
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్
మంచిర్యాల,(విజయక్రాంతి): యువతీ, యువకులు చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్ అన్నారు. బుధ వారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్నగర్ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో "యాంటీ డ్రగ్ సోల్జర్", "షీ టీమ్" సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై షీ టీమ్ సబ్ఇన్స్పెక్టర్ హైమతో కలిసి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై మంచి భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ సుస్థిరమైన భవిష్యత్తు కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కుటుంబం, సమాజం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు "షీ టీమ్"ను ఏర్పాటు చేసిందని, ఈ సేవలు ప్రతి మహిళకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు, యువతులు ఎక్కడైనా వేధింపులు, భద్రతా సమస్యల విషయంలో ఇబ్బందులు పడుతున్నా షీ టీమ్ వాట్సాప్ నెంబర్ (63039 23700) లేదా టోల్ ఫ్రీ నెంబర్ (1908) లలో సంప్రదించాలని కోరారు. అనంతరం విద్యార్థుల పలు అనుమానాలను నివృత్తి చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో మహిళా అధ్యాపకులు డీ సరిత, ఎం సుమ, సుజాత, అరుణ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.