25-06-2025 12:27:08 AM
- రూ.9వేల కోట్ల రైతు భరోసాను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
-గజ్వేల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు, రైతులు
గజ్వేల్, జూన్ 24: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతే రాజని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. టిపిసిసి ఆదేశాల మేరకు గజ్వేల్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకేసారి రైతులకు రూ. 9వేల కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయడం అభినందనీయమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, చేయడంతోపాటు రైతు భరోసాను అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సైతం కచ్చితంగా వ్యవహరిస్తూ రైతులకు వెంటవెంటనే ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు చేపడుతున్నారన్నారు.
కొందరు నాయకులు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటారన్నారు. అనంతరం రైతు వేదిక లో ప్రయత్నిస్తాన్ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, ఏ డి ఏ బాబు నాయక్, ఏఈఓ లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.