01-11-2025 12:31:50 AM
అశ్వాపురం,(విజయక్రాంతి): మొంథా తుఫానుతో అధిక వర్షపాతం కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని బి ఆర్ ఎస్ అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో తుఫానుతో దెబ్బతిన్న పత్తి పంట చేలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో సాగు చేసిన పత్తి పంటలు అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోయాయి. రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా, చేతికి వచ్చే దశలో పంట వర్షాలకు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భూసారానికి అనుగుణంగా ఎకరానికి 10–12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చోట ఇప్పుడు 3–4 క్వింటాలు కూడా రావడం లేదు అని అన్నారు. తడిసిన పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు సిసిఐ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, తేమ శాతం పేరుతో రైతులను తిరస్కరించకూడదని ఆయన కోరారు. పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి ఎకరానికి ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే, బి ఆర్ ఎస్ పార్టీ తరఫున రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.