calender_icon.png 26 June, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఈ శ్రీధర్‌కు 14 రోజుల రిమాండ్

13-06-2025 12:09:44 AM

  1. చెంచల్‌గూడ జైలుకు తరలింపు 
  2. బ్యాంకు లాకర్లు తెరిచేందుకు ప్లాన్
  3. కోర్టు అనుమతి కోరిన సిట్
  4. ఇప్పటివరకు రూ.150 కోట్ల మేర అక్రమాస్తుల గుర్తింపు

హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 12 (విజయక్రాంతి): అదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) నూనె శ్రీధర్‌కు గురువారం ఉద యం ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు అనంతరం నిందితుడిని చెంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు బుధవారం శ్రీధర్ హైదరాబాద్‌లోని నిందితుడి నివాసం సహా 13 చోట్ల బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సో దాలు చేపట్టారు.

శ్రీధర్ రూ.కోట్లు వెచ్చించి తన కుమారుడి వివాహాన్ని థాయ్‌ల్యాండ్‌లో నిర్వహించాడని ఏసీబీ గుర్తించింది. శ్రీధర్‌కు సంబంధించిన ఒక విల్లా, మూడు సొంత భవనాలు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో 19 ఓపెన్ ప్లాట్లు నిర్ధారించింది. అలాగే శ్రీధర్ పేరుపై 16 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించింది. రెండు లగ్జరీ కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలను గుర్తించారు.

వీటన్నింటి విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని 6, 7, 8 ప్యాకేజీలను నిందితుడు గతంలో పర్యవేక్షించాడు. ఆ సమయంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు తెలుస్తున్నది. ఏసీబీ ప్రస్తుతం నిందితుడికి సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచేందుకు కోర్టు అనుమతి కోరినట్లు తెలుస్తున్నది. లాకర్లలోనూ లెక్కకు మించిన నగదు, బంగారం, ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు ఉండొచ్చని ఏసీబీ అనుమానిస్తోంది. లాకర్లు తెరిస్తే అక్రమాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.