calender_icon.png 26 June, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి అభివృద్ధికి కృషి..

25-06-2025 07:36:07 PM

రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి..

మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి జీ వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) స్పష్టం చేశారు. పట్టణంలోని సింగరేణి జిఎం కార్యాలయంలో బుధవారం కారుణ్య నియామకం పొందిన డిపెండెంట్ లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసి మాట్లాడారు. బొగ్గు గని కార్మికులంటే పెద్దపల్లి మాజీ ఎంపీ దివంగత వెంకటస్వామికి అమితమైన ప్రేమ అని, ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను మూసి వేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుతో చర్చించి, ఎన్టీపీసీ నుంచి 400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారనీ ఆయన గుర్తు చేశారు. సింగరేణి సంస్థ వరుసగా లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశి క్షణ, కష్టపడి పనిచేయడం ద్వారానే సాధ్యమైందన్నారు.

నూతన కార్మికులు క్రమశిక్షణతో విధి నిర్వహించి సంస్థ అభివృద్ధికి దోహద పడాలన్నారు. తెలంగాణ లోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడు కోవడం మనందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో, సంస్థ అభివృద్ధిని మరిచి, కేవలం నిధుల వాడకానికే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో  కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతానని, కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం జి దేవేందర్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సిఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీనియర్ పిఓ కార్తీక్, సత్యనారాయణ, ఆఫీస్ సూపరింటెండెంట్ రాయలింగులు పాల్గొన్నారు.