07-06-2025 07:51:29 PM
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- రుద్రారంలో పీఏసీఎస్ దుకాణాల సముదాయాలు ప్రారంభం
పటాన్ చెరు: వ్యవసాయ రంగంలో ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని పీఏసీఎస్ ఆవరణలో రూ.40 లక్షలతో నిర్మించిన దుకాణాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిలువ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు.
దుకాణాల సముదాయాలు ద్వారా పీఏసీఎస్ లకు ఆర్థిక లభ్యత పెరుగుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో అర్హులైన రైతులకు రుణాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు ఆర్థిక అభ్యున్నతిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, రాజు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, పాలక మండలి డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు