11-06-2025 01:05:09 AM
ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ, జూన్ 10 (విజయ క్రాంతి): హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ప్రసూతి ఆసుపత్రిలో ఓపి సేవలను, స్కానింగ్ రూమ్, ప్రసవానంతర వార్డు లను పరిశీలించారు.
ప్రసవానంతర వార్డు లోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున ఆస్పత్రి నిర్వహణ బాగుండాలని అన్నారు. ఆసుపత్రిలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణ బాగుండాలన్నారు.
ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్య సేవలు అందించే విధంగా ఒక పాథాలజిస్ట్ అందుబాటులో ఉండే విధంగా కేటాయించాలన్నారు. ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం 2009లో జరిగిందని, ఇప్పుడు 16 ఏళ్ల తరువాత మళ్ళీ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధికి, వసతులు కల్పనకు తగిన ప్రతిపాదనలు వైద్యాధికారులు అందజేయాలని అన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రి బెడ్ల సంఖ్య, భర్తీ చేయాల్సిన వైద్యులు, సిబ్బంది సంఖ్య, ఇతర వసతులను కల్పించేందుకు సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి ప్రసూతి, వైద్య సేవలు నిమిత్తం ఎక్కువ మంది వచ్చే విధంగా కృషి చేయాలని ఆస్పత్రి వైద్యాధికారులకు సూచించారు. సాధారణ ప్రసవాలు అయ్యేవిధంగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, కెఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, ఇతర వైద్యాధికారులు, అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.