13-06-2025 02:16:13 AM
మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, జూన్ 12 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో ప్రధాన సమస్య అయిన యావర్ రోడ్ విస్తరణ కోసం కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
2008-2009లో యావర్ రోడ్డు విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు కోసం బై పాస్ రోడ్డు వేసి, గొల్ల పల్లి, ధర్మపురి రోడ్డు తో లింక్ చేశామన్నారు. గతంలోనే 60 ఫీట్ల రోడ్డును 100 ఫీట్ల కు విస్తరించాలని విన్నవించడం జరిగిందని దానికనుగుణంగాటౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారన్నారు.
2018లో యావర్ రోడ్డు విస్తరన చేపడితే కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తదో అని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ ప్రతిపాదనలను తొక్కి పెట్టారని జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రమే రోడ్డు విస్తరించి చేతులు దులుపుకున్నారన్నారు.విస్తరణలో నిర్మాణాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తే అప్పుడే యావర్ రోడ్డు సమస్య పరిష్కారం అయ్యేదని, ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా టీ డీ అర్ ను తెర పైకి తీసుకు వచ్చి ఐదేళ్లు గడిపారన్నారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోయినా తాను జగిత్యాల అభివృద్ధి కోసం యావర్ రోడ్డు విస్తరణ లో స్థలం కోల్పోయే వారికి నష్టపరిహారం సుమారు 100 కోట్లు నిధులు మంజూరు చేయాలని జూన్ 29, 2024న ముఖ్య మంత్రికి లేఖ రాసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, కొత్త మోహన్, కళ్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, చందా రాధ కిషన్, జితేందర్, మున్నాత దితరులున్నారు.