01-10-2025 01:38:54 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 30 (విజయక్రాంతి)రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరిత ఆదేశించారు.స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ పై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరిత హాజరై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. విధుల్లో భాగంగా ఎఫ్ఎస్, ఎస్ఎస్టీ లు సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్ తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని సూచించారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం, వాటిని పరిశీలించడంపై వివరించారు. ఆయా మండలాల నోడల్ ఆఫీసర్లు తమ నివేదికను ప్రతి రోజు పంపించాల్సి ఉంటుందని తెలిపారు.
ఎంసీసీ నోడల్ ఆఫీసర్ గా డీఆర్డీఓ శేషాద్రి నియమించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఉంటాయని తెలిపారు.సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ షర్ఫుద్దీన్, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.