10-01-2026 07:37:09 PM
వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగతో కలిసి ఆమె మాట్లాడారు.
గ్రామీణ పేదలు, కూలీలు, రైతుల జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ప్రజావ్యతిరేకమని విమర్శించారు.ఉపాధి హామీ చట్టం ద్వారా కోట్లాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించబడుతోందని, అలాంటి చట్టాన్ని బలహీనపరచడం అన్యాయమని అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కనపెట్టి కార్పొరేట్కు అనుకూలమైన విధానాలను అమలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకొని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.