12-08-2025 12:00:00 AM
మత్స్యకార సొసైటీకి తీరని నష్టం
బెల్లంపల్లి, ఆగస్టు11: బెల్లంపల్లి మండలం లోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోగల ఎర్రగుంట చెరువును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చెరువులో నీరు నిల్వ లేకుండా కాలువ తీయడంతో తమకు తీరని నష్టం వాటిల్లిందని మత్స్యకార సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమ వారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చెరువు లోని నీరు కాలువ ద్వారా కన్నాల గ్రామ పరిసరాల్లోని మళ్లడంతో పొలాలు జలమయమయ్యాయి.
ఈ చెరువులో లక్ష రూపాయల విలువ చేసే చేప పిల్లలను వేసినట్లు మత్స్యకార సొసైటీ సభ్యులు చెబుతున్నారు. చెరువు ను పూర్తిగా ధ్వంసం చేయడంతో చుక్కనీరు నిలవని పరిస్థితి తలెత్తిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువు పూర్తిగా ధ్వంసమై నీరు నిలవకుండా వృధాగా పోవడంతో పక్కనే ఉన్న 450 ఎకరాలు ముంపుకు గురవుతున్నట్లు కన్నాల గ్రామానికి చెందిన జి .వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొసైటీకి రూ లక్ష వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు.