23-06-2025 12:00:00 AM
సంగారెడ్డి, జూన్ 2౨(విజయక్రాంతి): అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్-2020 స్కీం కింద 25 శాతం రాయితీ ప్రకటించింది. ఫీ జు చెల్లింపు గడువు ఇప్పటికే మూడుసార్లు పొడి గించింది.
అయినా ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో మరోమారు ఈనెల 31 వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత గడువులో చెల్లింపునకు దరఖాస్తుదారుల్లో పెద్దగా స్పందన కనిపించడంలేదు.
25 శాతం రాయితీతో...
ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. రూ.వెయ్యి చెల్లించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారి ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. వేలల్లో దరఖాస్తులు రావడం వాటి పరిశీలనకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో తగినంత సిబ్బంది లేక ప్రక్రియ మందకొడిగా సాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎల్ఆర్ఎస్ నిబంధనలు సడలించింది.
గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఆక్రమ లేఅవుట్లలో 10 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయితే విక్రయించకుండా ఉన్న ప్లాట్లకూ అవకాశం కల్పించింది. ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్టైం సెటిల్మెంట్ అవకాశం కూడా కల్పించింది. తాజాగా మరో మారు గడువును పెంచడం గమనార్హం.
పదేపదే గడువు పెంచినా...
ఎల్ఆర్ఎస్ కు 25శాతం ఫీజు రాయితీ ప్రకటించిన ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది.
దీంతో మే 3వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో మే 31వ తేదీ వరకు చెల్లింపు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో రాయితీ చెల్లింపు జరగలేదు. దీంతో మరోమారు ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు పొడిగించడం జరిగింది.
కారణాలు అనేకం..
ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరిదిద్దడంలో అధికారుల మధ్య సమన్వయ లోపం, ఫీజు చెల్లించినా సకాలంలో ప్రాసీడింగ్లు అందించకపోవడం, ఎల్ఆర్ఎస్పు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం లాంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు.
పరిశీలనలోనూ జాప్యం...
రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది వివిధ దశల్లో ప్లాట్లను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చెరువు శిఖం, బఫర్ జోన్లను నీటి పారుదల శాఖాధికారులు గుర్తించాల్సి ఉండగా ప్రభుత్వ, అసైన్డ్ ఇతర వివాదాస్పద భూములను రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సిపల్ అధికారులకు వివరాలు అందించాల్సి ఉంది.
వాటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత బల్దియా అధికారులు క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమవడం, ఎల్ఆర్ఎస్ ప్లాట్ల పరిశీలనలో జాప్యం చేస్తుండటం కూడా క్రమబద్ధీకరణ ప్రక్రియపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.