calender_icon.png 9 June, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరివాడు దత్తన్న

09-06-2025 01:48:41 AM

నేటితరం రాజకీయ నాయకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి

  1. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అలయ్‌బలయ్ 
  2. దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ..‘ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  3. విలువలతో కూడిన రాజకీయాలు అవసరం: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
  4. పుస్తకావిష్కరణ చేసిన మాజీరాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్
  5. రాజకీయాల్లో నన్ను వేలుపట్టి నడిపించారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  6. లేఖలు రాయడంలో దత్తన్న బ్రాండ్ అంబాసిడర్: ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాజకీయాల్లో కార్పొరేటర్లు కూడా ఎంతో గొప్పలకు పోయే ఈ రోజుల్లో ఎంపీ, కేంద్రమంత్రి, గవర్నర్‌గా ఎన్నో పదవులు అధిరోహించిన బండారు దత్తాత్రేయ వ్యక్తి త్వం ఎంతో గొప్పదని రేవంత్‌రెడ్డి కొనియాడారు. గతంలో వాజ్‌పాయ్..ఇప్పుడు దత్తాత్రేయ ప్రజాభిమానంలో సాటిలేని నాయకులని కితాబునిచ్చారు. పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని తెలిపారు.

హర్యానా గవర్నర్ బండా రు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ.. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్ర మం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ ఆటోబయోగ్రఫీ బండారు దత్తాత్రేయ స్వయంగా రాయ గా.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై ప్రసంగిస్తూ.. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించేవారు బండారు దత్తాత్రేయ జీవనశైలిని చూసి ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు.

దత్తాత్రే య 19 ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని గుర్తుచేశారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు సుదీర్ఘమైన ప్రయాణంలో దతన్న ఎన్నో ఒడిదొడుకులను అనుభవించారని తెలిపారు. ఆయనతో తనకు 40ఏళ్ల అనుబంధం, దత్తాత్రేయ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంలో దత్తాత్రేయ అజాతశత్రువు అని కొనియాడారు. బీజేపీ నాయకుడిగా కన్నా దత్తాత్రేయను ఒక మ ర్యాద కలిగిన నాయకుడిగా అందరూ గౌరవిస్తారని అన్నారు. జంటనగరాల ప్రజలకు ఏ బాధ ఉన్న వినడానికి ఇద్దరు నాయకుల పేర్లు వినిపిస్తాయని వారే..పి.జనార్దన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ అని తెలిపారు. వీరిలా ప్రజల సమస్యలు వినే నాయకుడు ఎవరూ హైదరాబాద్‌లో లేరన్నారు.

అప్పట్లో తిరుమల దర్శనం టికెట్లు, రైల్వేరిజర్వేషన్ టికె ట్లు, టెలిఫోన్ కనెక్షన్లు కావాలంటే తాము దత్తాత్రేయ వద్దకే వెళ్లేవారిమని గుర్తుచేసుకున్నారు. అలాగే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తా ను కలిస్తే ఈ రాష్ట్రం మరింత ముందుకుపోతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా కిష న్‌రెడ్డిని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూనే, వారితో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ముఖ్య మంత్రి చెప్పారు.

విరోధులు లేని నాయకుడు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్

రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ ఏదో సందర్భంలో విరోధులు ఉంటారని..కానీ తనకు తెలిసినంత వరకు బండారు దత్తాత్రేయ వి రోధులు లేని నాయకుడని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలిపారు. హి మాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఆయన చలిని తట్టుకోలేక ఇబ్బందులు పడిన రోజులను మాజీ రాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు.

తనకు అక్కడ పనిచేయడం కష్టంగా ఉందని..మీరు ఏదైనా చేసి తనకు ఇబ్బంది లేకుండా చూ డాలని కోరారని, ఎక్కడకు మార్పు కావాలని కోరితే మీ ఇష్టమంటూ తనపైనే భారం వేశారని తెలిపారు. తాను ఆయన్ను హర్యానాకు మార్చడంతో చలి బాధ నుంచి విము క్తి పొందారని అన్నారు. 

ఎంతోమందిని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దారు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తాను ఈరోజు ఈ స్థానంలో ఉండటానికి కారణం బండారు దత్తాత్రేయనే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. దత్తాత్రేయతో కలిసి ఎన్నో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొ నే అవకాశం తనకు దక్కిందన్నారు. రాజకీయాల్లో దత్తాత్రేయ తనను వేలుపట్టి నడిపించారని కొనియాడారు. ఆయన ప్రాతిని థ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా గెలవడం చాలా గర్వంగా ఉందన్నారు.

1980లో మోటార్‌సైకిల్‌పై ఆయనతో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగే అదృష్టం తనకు కలిగిందన్నారు. సేవాభారతి కార్యక్రమం ద్వారా బస్తీల్లో ఆయన తో పాటు సేవచేసే అవకాశం లభించిందన్నారు. రాజకీయాల్లోకి అందరిని కలుపుకు నిపోయే నాయకులు రావాలని..ఈ విషయంలో దత్తాత్రేయను స్ఫూర్తిగా తీసుకో వాలని సూచించారు. 

దత్తాత్రేయ జీవితం తెరిచిన పుస్తకం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పార్టీలు మారే రాజకీయ నాయకులపై మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దత్తాత్రేయ జీవి త చరిత్ర ప్రజలకు అవసరం లేదని, ఆయన జీవితమంతా తెరిచిన పుస్తకం లాంటిదని.. మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. పదవులు ఉన్నా.. లేకున్నా..దత్తాత్రేయ ఒకే పార్టీలో కొనసాగారన్నారు.

కానీ కొంతమంది నాయకులు పిల్ల లకు డైపర్లు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. ‘బస్టాండుల్లో బస్సు ల రాకపోకల వివరాలతో సూచికలు ఉం టాయి. అలాగే ఏ నాయకుడు ఏ పార్టీ లో ఉన్నారో సూచికలు ఏర్పాటు చేయాల్సి వ చ్చేలా ఉంది..’ అని వ్యాఖ్యానించారు.

విమర్శలు ఎప్పుడూ కూడా దిగజారిచేయకూడ దని, బూతులు మాట్లాడేవారిని ప్రజ లు కూ డా సహించొద్దని.. ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. దత్తాత్రేయ ‘గంజ్’లో పేదరికంలో పుట్టి పెరిగి..ఉన్నత స్థానాలకు చేరుకు న్నారని తెలిపారు. స్వభావరీత్యా ఆయన ఇంకా ‘గంజ్’ మనిషిగానే ఉన్నారు తప్పిం చి.. ‘బెంజి’ మనిషిలా మారలేదని చమత్కరించారు. 

జెంటిల్‌మెన్ దత్తాత్రేయ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

బండారు దత్తాత్రేయ జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొనియాడారు. దత్తాత్రేయను దత్త న్న అని అభిమానంగా పిలుచుకుంటారని తెలిపారు. దత్తాత్రేయది పేరుకు హిందుత్వమని.. మతం భారతీయమని.. కోరుకునేది జనహితమని..ఆయనది లౌకికవాదమని కొనియాడారు.

ప్రజా సమస్యలపై సీఎంల కు, ప్రభుత్వాలకు దత్తాత్రేయ ఎన్నో లేఖ లు రాసేవారని.. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో అందుకున్నట్లు తెలిపారు. దేశం ప్రపంచంలో నెం బర్‌వన్ కావాలని, తెలుగువారు దేశంలో నెంబర్‌వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. మొన్నటివరకు యూదుల గురించి మాట్లాడారని ఇప్పుడు ప్రపంచం తెలుగు వారి గురించి మాట్లాడాలన్నారు.

ప్రజల హృదయాలను గెలుచుకున్నారు : ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

దత్తాత్రేయ రాజకీయాల్లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని బీజేపీ ఎంపీ డా.కే లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటములు ఎ దురైనా ఆయన ఏనాడూ వెనక్కి తగ్గలేదన్నా రు. దత్తాత్రేయ ఎంపీగా ఉన్న సికింద్రా బాద్ పార్లమెంట్ కింద తాను రెండుసార్లు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసినట్లు గుర్తుచే శారు. దత్తాత్రేయ ఎంతో అంకితభావంతో పని చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు.

ఒక్కరిని ఒక్కరు కలిసే పరిస్థితి లేని రోజుల్లో అందరినీ అలయ్‌బల య్ వేదిక కలిపిందని అందుకు దత్తాత్రేయ ను ఎంతో అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమానికి అలయ్‌బలయ్ చైర్‌పర్సన్, దత్తా త్రేయ కూతురు విజయలక్ష్మిఅధ్యక్షత వహించగా.. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఆం ధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్‌నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో పాటు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

స్కూల్ బీజేపీలో.. కాలేజీ టీడీపీలో.. ఉద్యోగం రాహుల్ వద్ద: సీఎం రేవంత్‌రెడ్డి

‘స్కూల్ బీజేపీలో.. కాలేజీ టీడీపీలో చదువుకున్నా.. ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దగ్గర చేస్తున్నా..’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని మోదీతో నీతిఆయోగ్ కార్యక్రమంలో మధ్యా హ్న భోజనసమయంలో ఆయనకు చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుసక్తావిష్కరణ కార్యక్రమానికి హాజరైన గవర్నర్లను చూస్తే ఇది గవర్నర్ల పరేడ్ లా ఉందని చమత్కరించారు. అలాగే తన మంత్రివర్గ సహచరులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తాను క్యాబినెట్ మీటింగ్ ఇక్కడే పెట్టుకోవచ్చని చలోక్తి విసిరారు. 

సమాజహితం కోసమే రాజకీయాలు 

రాజకీయాలు సంపద కోసం కాదని..సమాజహితం కోసమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. మనం ఈ గడ్డ మీద ఉన్నా లేకున్నా భరతమాత వైభవం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల్లోనూ ఈ భావన ఉండాలన్నారు. రాజకీయాలను వ్యాపారంగానో, వృత్తిగానో భావించి పనిచేయవద్దని హితవు పలికారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు అవసరమన్నారు.

సమాజం అంటే పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలన్నారు. ఆ వర్గాలకు విద్య, వైద్యం, నైపుణ్యాలు కల్పించాలని అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను ఎన్నో పదవులు చేపట్టానని అవన్నీ బీజేపీ కార్యకర్తల కృషి, సాయం వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు.

పార్టీ కార్యకర్తలే నా ఆస్తి అని..వారి ఇండ్లలోనే తిన్నా, వారితోనే ఉన్నానని అన్నారు. తన సతీమణి వసంత తనకు అన్ని విధాలా అండగా ఉండటం వల్లే ప్రజలకు సేవ చేయగలిగినట్లు తెలిపారు. తన కుమారుడు మృతిచెందినా కూతురు విజయలక్ష్మియే కొడుకుగా, కూతురుగా ఉండి తనకు ధైర్యం చెప్పిందన్నారు. 

 హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ