calender_icon.png 22 October, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ దృఢ సంకల్పం

21-10-2025 10:39:47 PM

హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళాకు సర్వం సిద్ధం..

నిరుద్యోగం సమాజంలో అతి పెద్ద సవాల్‌గా మారింది..

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు అమ్మి చదివిస్తున్నారు..

నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి మార్గాలు..

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

హుజూర్ నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ దృఢసంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ నెల 25న జరగనున్న జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసిందని, ప్రైవేట్‌ రంగంలో కూడా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. నిరుద్యోగం సమాజంలో అతి పెద్ద సవాల్‌గా మారిందన్నారు.

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు అమ్మి చదివిస్తున్నారు.కానీ వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి మార్గాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ, సింగరేణి కాలరీస్‌ సహకారంతో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఇప్పటికే 205 కంపెనీలు, 9500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పరిశ్రమలు పాల్గొననున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు  భోజన సదుపాయం కల్పించడమే కాకుండా, పార్కింగ్‌, రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, కంపెనీ స్టాల్స్‌, భోజన ఏర్పాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

స్థానిక నాయకులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని సూచించారు. మెగా జాబ్ మేళాను విజయవంతం చేయడానికి ఉమ్మడి జిల్లాలో పేపర్‌ ప్రకటనలు, పాంప్లెట్లు, వాల్‌పోస్టర్లు, బస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ,డీట్‌ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్, ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి, తన్నీరు మల్లికార్జున్, కోతి సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.