calender_icon.png 25 June, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి కేంద్రంగానే సాగిన జీవితం.. తెలంగాణ రైతాంగ జీవితం

24-06-2025 06:41:21 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా ఉత్సవాలు(Farmers Assurance Festivals ) జరుగుతున్నాయి. హైదరాబాద్ సెక్రటేరియట్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం(Rajiv Gandhi Statue) వద్ద రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీపరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుభరోసా నిధులను(Farmers Insurance Fund) చెప్పిన మాట ప్రకారం 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు విజయవంతంగా జామ చేసింది.

ఈ సందర్భంగా రైతులతో తెలంగాణ సెక్రటేరియట్(Telangana Secretariat) సమీపంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వేశామని, రైతుభరోసా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల ఆశీర్వాదం వల్లనే తను చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ రెడ్డి తెలిపారు. భూమి కేంద్రంగానే సాగిన జీవితం.. తెలంగాణ రైతాంగ జీవితం అని, వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగ చేసేందుకే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఉచిత విద్యుత్ అందించినట్లు గుర్తు చేశారు. 

ఈ ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులు, తర్వాత మహిళలు, యువతే అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. గత ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి వేసుకోవడమే అని చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇవ్వడమే కాదు.. 48 గంటల్లో డబ్బు జమ చేశామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రమని గర్వంగా చెప్పుకుంటున్నామని, మాజీ సీఎం కేసీఆర్ రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టడం.. కూలడం కూడా జరిగిపోయిందని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చాయి..?, రాష్ట్రం దివాలా తీస్తే వాళ్లు ఎట్లా సంపన్నులయ్యారు..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ గత పదేళ్లలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూత వేయించారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం అంటే రైతును రాజును చేయడం అని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.