calender_icon.png 24 June, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఇంట పెట్టుబడి పంట

24-06-2025 12:42:37 AM

  1. రైతు ఖాతాలో రైతు భరోసా పథకం డబ్బులు 

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకం అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతుంది. వానకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6000 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం డబ్బులు ఖాతాల్లో జమ జమ చేస్తూ అన్నదాతల్లో భరోసా నింపుతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు రైతు భరోసా డబ్బులు రావడంతో పెట్టుబడి చింత తీరిందని తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీంతోపాటు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసి అన్నదాతలకు రుణ విముక్తి కల్పించింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు అవుతుంది. అందులో ప్రధానంగా రైతులు పత్తి పంట సాగు చేయగా వరి ,సోయాబీన్, కంది ,జొన్న, మిర్చి ఇతర వాణిజ్య పంటలతో పాటు కూరగాయల ను సాగు చేస్తుంటారు.

సాగులో నూతన పద్ధతులను, ఆధునిక యంత్రాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతు భరోసా పథకాన్ని పాత వారి కే కాకుండా ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా ప్రభుత్వం వర్తింప చేయడంతో వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

15 ఎకరాల లోపు డబ్బులు జమ

రాష్ట్ర ప్రభుత్వం వానకాల పంటల పెట్టుబడి కోసం అన్నదాతల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా పథకం కింద డబ్బులను జమ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 143063 మంది రైతులు ఉండగా 266.86 కోట్ల నిధులు అవసరం ఉంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 15 ఎకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది.131287 మంది రైతుల ఖాతాలలో 240.60 కోట్ల రూపాయలను జమ చేసింది.

ప్రభుత్వం దశలవారీగా పెట్టుబడి సాయం అందజేయడంతో అన్నదాతల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆర్థిక సాయం అందజేయడంతో వ్యవసాయానికి కావలసిన ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేసేందుకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక భారానికి ప్రభుత్వం అందజేస్తున్న సాయం ఎంతగానో తోడ్పడుతుందని అన్నదాతలు  అంటున్నారు. 

రైతు భరోసా డబ్బులు వచ్చాయి 

వానకాలం పంట వేసేందుకు ప్రభుత్వం రైతు భరోసా కింద నా బ్యాంకు ఖాతాలో 27 వేల రూపాయలను జమ చేసింది. నేను 4.5 ఎకరాలలో పంట సాగు చేస్తున్నాను. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం నాకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులందరికీ పెట్టుబడి సాయం చేయడం సంతోషంగా ఉంది. రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది.

 చునార్ కార్ వసంత్, బాబాపూర్ 

అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం

జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథ కం కింద పెట్టుబడి సాయం అం దించడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 15 ఎకరాల లోపు 131287 మంది రైతుల ఖాతాల్లో 240.60 కోట్లు జమ చేయడం జరిగింది. రైతులు ఆర్థికంగా  బలపడాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందజేస్తుంది.

రైతు భరోసా వచ్చిన అన్నదాతలు డబ్బులను వ్యవసాయ పనులకు వినియోగించాలని కోరుతున్నాను. రైతు ఆర్థికంగా బలపడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి.

 వెంకటేశ్ ధోత్రే, కలెక్టర్