calender_icon.png 14 October, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

14-10-2025 07:01:22 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ (విజయక్రాంతి): పత్తి పంట కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటల కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పత్తి కొనుగోలు ప్రక్రియను నిర్ణీత సమయానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కొనుగోళ్లకు సంబంధించి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ కోసం ‘కపాస్ కిసాన్ యాప్’ వినియోగించాలని తెలిపారు. రైతులకు ఈ యాప్‌ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. రైతు వేదికల ద్వారా, గ్రామాల్లో ఎవోలు, ఎఈవోలు రైతులకు ఈ యాప్‌ వినియోగ విధానాన్ని వివరించాలన్నారు.

రైతులు పత్తి కొనుగోలు సంబంధిత సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5779 లేదా వాట్సప్ నంబర్ 8897281111ను సంప్రదించి సమాచారం పొందవచ్చని వివరించారు. రైతుల పంటకు ఖచ్చితంగా మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తేమ శాతం విషయంలో రైతులు నష్టపోకుండా వారికి పూర్తి వివరాలు ముందుగానే తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిన్నింగ్ మిల్లులలో అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలని, ముఖ్యంగా అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వే బ్రిడ్జీలకు నిర్ణీత గడువులోపే స్టాంపింగ్ చేయించుకోవాలని సూచించారు. రైతులు పంటలు అమ్మిన వెంటనే వారికి నిర్ణీత గడువులోపు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అలాగే, మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు తమ పంటను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించవద్దని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ‘కపాస్ కిసాన్’ యాప్ గోడప్రతులను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మార్కెటింగ్ అధికారి గజానంద్, ఆర్డీఓ రత్నకళ్యాణి, మార్క్‌ఫెడ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు భీమ్ రెడ్డి, అబ్దుల్ హాదీ, రైతులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.