ఇస్రోలో ఉద్యోగం సాధించిన శ్రీనాథ్కు సన్మానం
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 5 (విజయక్రాంతి): భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామానికి చెందిన కోరవేణి శ్రీనాథ్ ఇస్రోలో ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించిన పోటీ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ బుధవారం శ్రీనాథ్ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచస్థాయిలో చాటుతున్న ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో శ్రీనాథ్ ఉద్యోగం సాధించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రతిభతో ఇస్రోలో ఉద్యోగం సాధించడం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు శ్రీనివాస్, మామిడి శ్రీకాంత్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.






