ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
- వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
- సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్ , ఆగస్టు 5 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యాధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ఓపీ విభాగం, వార్డులు, ప్రసూతి విభాగం, ల్యాబ్, ఫార్మసీ, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యాధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ (అవుట్ పేషెంట్లు) సంఖ్య పెరిగేలా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి నిరంతర పర్యవేక్షణలో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ తనిఖీలో సంబంధిత వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






